9 Dec 2010

ఆరెంజ్ - సినీ అనాలిసిస్
( ... ఇంకొంచెం ప్రేమించు )

మొత్తానికి నిన్న ఎలాగైతేనేం, ఆరెంజ్ సినిమా చూసేసాను. చూసిన తర్వాత ఎందుకో ఈ మూవీ మీద రివ్యూ లాంటిది రాద్దామని అనిపించింది. కాని, ఆలో'చించగా'  ఈ మూవీ కి రివ్యూ కాదు, అనాలిసిస్ రాయాలి అనిపించింది. ఎందుకంటే చాలామంది ఈ సినిమా చూసి 'కన్ఫ్యూషన్' లాంటి దానికి గురయ్యారు.

ముందుగా ముగ్గురిని మనం ఈ సినిమా తీసినందుకు అభినందించాలి ... ఒకటి భాస్కర్ - ఇటువంటి ఒక రిస్క్ తో కూడుకొని వున్న కథకి పకడ్బందీ గా స్క్రీన్ ప్లే రాసుకుని , దాన్ని అంతే చక్కగా తెరకి  ఎక్కించినందుకు ... రెండు ... చరణ్ - మగధీర తీసుకొచ్చిన మెగా మాస్ ఇమేజ్ ని మోస్తూ ఇంతటి సున్నితమైన మరియు రిస్క్ తో కూడుకొని వున్న లవ్ స్టోరీ ని నమ్మి అత్యద్భుతం గా నటించడం ... మూడు ... నాగబాబు - భాస్కర్ని, చరణ్ ని అంతకంటే ఎక్కువగా ఈ కథని నమ్మి ఈ సినిమా ని నిర్మించడం. అనాలిసిస్ లోకి వెళ్ళే ముందు, అసలు కథేంటి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ ఎలా వున్నాయి అని త్వర త్వర గా ఒక సారి చెప్పేసుకుందాం.

కథేంటి? 
రామ్ (చరణ్) వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అతనికి ఇంకా "గ్రాఫిటీ" అంటే ప్రాణం. ( ఈజీ గా అర్ధమయ్యేలా చెప్పాలంటే, గ్రాఫిటీ అంటే గోడలమీద పెయింట్ తో రక రకాల బొమ్మలు గీయడం ). జాను (జెనిలియా) ఒక బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కొనే ప్రయత్నం లో వుండగా రామ్ పరిచయమవుతాడు, జాను ని చూడగానే మనసు పారేసుకుంటాడు. రామ్ కి జాను పరిచయమవ్వక మునుపు 9 లవ్ స్టోరీస్ (ఫెయిల్యూర్స్) వుంటాయి. ఏ ఇద్దరి మధ్య లవ్ కలకాలం ఒకేలా ఉండదని, అందుకనే ప్రేమ కొంత కాలం మాత్రమే బాగుంటుందని, తరువాత బోర్ కొడుతుందని, సో తను కొంతకాలం మాత్రమే ఎవరినైనా లవ్ చేస్తానని / చేయగలడని నమ్ముతాడు. ఎవరైనా ఒకరిని లైఫ్ లాంగ్ ప్రేమిస్తానని చెప్తే దానికి గారెంటి ఏమిటని ప్రశ్నిస్తాడు? ఎవరైనా తన లవర్ ని గాని పార్టనర్ ని గాని తనని లైఫ్ లాంగ్ లవ్ చేస్తారని నమ్మి ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు అని అడుగుతాడు. తాను ఒక గ్రేట్ లవర్ నని, తనకంతా గొప్పగా, నిజాయితీ గా, అబద్ధాలు చెప్పకుండా ఏ కుర్రాడూ ప్రేమించలేడని అనుకుంటాడు. జాను తనని ప్రేమిస్తోందని చెప్పినపుడు, తన ఐడియాలజీ గురించి, తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి అంతా చెప్పి, తను కొంత కాలం మాత్రమే ప్రేమించగలనని చెప్తాడు. తనకి లైఫ్ లాంగ్ ప్రేమించాగలిగే వాడు కావాలని, కొంత కాలం మాత్రమే సాగే ప్రేమ తనకి అక్కర్లేదని చెప్తుంది. రామ్ తన ఐడియాలజీ కరెక్ట్ అని నమ్మించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తాడు.  జాను తనకు తెలిసిన అందరి లవర్స్ రిలేషన్ మీద, చివరికి తన తల్లిదండ్రుల మధ్య ప్రేమ పై కూడా సందేహ పడేలా తయారవుతుంది. కాని ఫైనల్ గా, తనని జీవితాంతం ప్రేమిచగలిగితేనే అది నిజమైన ప్రేమ అని నమ్మి, తనని ఇపుడు రామ్ ప్రేమించేటంత ప్రేమ తనకు జీవితాంతం కావాలని ఖరాఖండి గా చెపుతుంది. రామ్ కూడా జాను ని అంత తేలిగ్గా వదులుకోలేకపోతాడు. తన ఇంటిపక్కనుండే ఒక పెద్దమనిషికి ప్రేమ గురించి వున్న విశ్వాసం అతను మాట్లాడిన మాటలు రామ్ ని ప్రభావితం చేస్తాయి. సముద్రమంత ప్రేమని చూడాలంటే అది జీవితం చివరలోనే సాధ్యమని, అదీ కూడా ఒక్క మనిషిని అన్నాళ్ళు ప్రేమించాగాలిగితేనే నని అతనన్న మాటలు రామ్ ఆలోచనా విధానం లో మార్పు తీసుకువస్తాయి. లైఫ్ లాంగ్ ఎలా ప్రేమించాలో, తన లవర్ లో ఆ నమ్మకాన్ని ఎలా కలిగించాలో ఆలోచిస్తుంటాడు. తన దగ్గరున్న కొంచెం ప్రేమ ఐపోతే ఇంకొంచెం ప్రేమిస్తానని, అదీ ఐపోతే ఇంకొంచెం ప్రేమిస్తానని ... అలా ఇంకొంచెం ప్రేమిస్తూనే ఉండడానికి ట్రై చేస్తానని చెప్తాడు జాను తో.   రామ్ కిష్టమైన గ్రాఫిటీ ని వదిలేసి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ గా జాయిన్ అవమని జాను అడుగుతుంది. తనకోసం ఆ పని చేయమని నిలదీస్తుంది. జాను ఒక సెల్ఫిష్ అని, తన కోసం గ్రాఫిటీ ని వదులుకోలేనని, తనని ఇంక ప్రేమించలేనని చెప్పి వచ్చేస్తాడు. తన ప్రస్తుత అయిడియాలజీ కి కారణమైన తన టీనేజ్ లవ్ స్టోరీ ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పట్లో లవర్ కోసం తనను తాను కోల్పోవలసి వచ్చిందని, అందుకనే తనకి లాంగ్ లవ్ ల మీద సదభిప్రాయం లేదనీ చెప్తాడు. కాని చివరికి తను ప్రేమించే వారి ఆనందం కోసం  ఒక పని చేయడం, ఆ ప్రయత్నం లో తనని తాను మనస్పూర్తి గా వదులుకోవడం లో వున్న తృప్తి ని గ్రహిస్తాడు. తన ప్రేయసి కి లైఫ్ లాంగ్ ప్రేమ అని అందించగలననే నమ్మకాన్ని కలిగించగలననే విశ్వాసంతో  ఉత్సాహం గా ముందడుగేస్తాడు. అక్కడితో సినిమాకి తెర పడిపోతుంది.

పెర్ఫార్మెన్సెస్ :
భాస్కర్ పక్కా గా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ని అంతే పెర్ఫెక్ట్ గా తీసాడు. కథ, కథనం లో  కూడా ఎక్కడా కూడా టెంపో మిస్ అవకుండా చాలా బాగా పిక్చరైజ్ చేసాడు. సీన్ టు సీన్ అన్నీ లాజికల్ గా కనెక్ట్ అయ్యి వున్నాయి. పాటల్ని చాలా నీట్ గా, కథలో కలిసిపోయేలాగా చిత్రీకరించాడు. టోటల్ గా   మూవీ ఈజ్ వెరీ క్లీన్ అండ్ నీట్. జెనిలియా మొదటి 15 నిమిషాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఆమె డైలాగ్స్ చాలా స్పీడ్ గా వుండి కొంత అయోమయానికి గురిచేస్తాయి. ఇంట్రడక్షన్ సీన్ లో మరీ ఎక్కువ చేసినట్టు కనపడుతుంది.కాని సినిమా సాగుతున్న కొద్దీ జెనిలియా తన స్థాయి పెర్ఫార్మెన్స్ ను చూపించింది. "యో యో గర్ల్స్" సీన్ లో సూపర్ గా చేసింది. పెర్ఫార్మన్స్ పరం గా జెనిలియా బాగా చేసినప్పటికీ, గ్లామర్ పరం గా జెనిలియా ఈ సినిమా కి మైనస్ అయింది. జెనిలియా లో మునుపటి సినిమాలలో వున్న చార్మ్ గాని, బబ్లీనెస్ గాని, అందం గాని ఎక్కడా కనపడలేదు. ముఖం లో కళ లేకుండా పాలిపోయినట్టు గా ఉంది సినిమా అంతా. జెనిలియా డ్రస్సింగ్ స్టైల్ గాని, హెయిర్ స్టైల్ కాని అంత ఇంప్రెస్సివ్ గా లేవు. బ్రహ్మానందం పాత్ర "పప్పీ" మొదలవడం కూడా అంత  ఇంప్రెస్సివ్ గా లేదు కాని, సినిమా లో కథ ముందుకు వెళ్ళే కొద్దీ "పప్పీ" పాత్ర హీరో క్యారెక్టర్ ని ప్రేక్షకులకి కనెక్ట్  చేసే కాటలిస్ట్ లాగ ఉపయోగ పడింది. బ్రహ్మానందం ఏ మాత్రం కష్టపడకుండా అలవోక గా చేసుకెళ్ళిపోగల పాత్ర ఇది. బ్రహ్మి ఖచ్చితమైన డైలాగ్ టైమింగ్ తో తన పాత్ర చక్కగా పండించాడు. "అష్టా చెమ్మా" ఫేం 'అవసరాల శ్రీనివాస్' ని అవసరానికి తగినంత వాడుకోలేకపోయారు.  'వెన్నెల కిషోర్' ని కూడా ఎక్కువ ఉయోగించుకున్నది లేదు. అతను చేసిన కొన్ని సీన్స్ బాగా చేసాడు. హీరోయిన్ తండ్రి గా చేసిన తమిళ హీరో "ప్రభు", హీరో పక్కింటి వ్యక్తి గా కనిపించి హీరో కి హితబోధ చేసే పాత్రలో నాగ బాబు , హీరో అక్క బావ గా వేసిన, నిజ జీవితంలోకూడా భార్యా భర్తలైన , మంజుల & సంజయ్, హీరో ఫ్రెండ్ లవర్ "మాయ" గా కనిపించిన "హ్యాపీ డేస్" అప్పు .. అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేసారు.   హారిస్ జయరాజ్ సంగీతం చాలా హాయి గా ఉంది. పాటలన్నీ కూడా కథ లో ఇమిడి పోయి కథనానికి సహకరించే విధం గా వున్నాయి. పాటల చిత్రీకరణ చాలా హాయిగొలిపే విధం గా ఉంది. పాటలు కూడా అనవసర రాద్ధంతపు రణగొణ ధ్వనులేమి లేకుండా, సాహిత్యం అర్ధమయ్యే విధంగా, మెలోడియస్ గా వున్నాయి. పాటలలో సాహిత్యం కూడా బాగుంది. అన్ని పాటలు కేవలం మేల్ వాయిస్ తో నే వుండడం గమనార్హం. కథా ఔచిత్యానికి తగినవిధంగానే పాటలు ఓన్లీ మేల్ వాయిస్ తో వున్నాయని సినిమా చూసాకా తెలుస్తుంది. (  "తొలిప్రేమ" సినిమా లో లాగా )

ఇంక చివరగా మరియు ముఖ్యం గా, చరణ్. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్, కంప్లీట్ చరణ్'s  షో. ఎంతో సున్నితమైన స్టొరీ ఇది. హీరో పాత్ర ఏ మాత్రం ఎక్కువ తక్కువ చేసినా సినిమా లో ఫీల్ పాడై బాలన్సు పోతుంది. చరణ్ ఎంతో సటిల్డ్ పెర్ఫార్మన్స్ ను చూపించాడు. ఏ సీన్ లో దేనికి ఎంత ఎలా ఎక్స్.ప్రెషన్ ఇవ్వాలో పర్ఫెక్ట్ గా చేసి ప్రతీ సీన్ ని అద్భుతం గా పండించాడు. ఖచ్చితమైన టైమింగ్ తో సాధికారత తో డైలాగ్స్ ని పలికాడు. ఒక స్టార్ గా కాకుండా, తన ఇమేజ్ కి భిన్నమైన పాత్ర ను , కథను చేస్తూ, ఒక మంచి  ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు ఈ చిత్రం తో. పాటల్లో స్టెప్పులు చాలా హాయి గా , కొత్తగా వున్నాయి. కిందపడి, ఫిట్స్ రోగి గిల గిల కొట్టుకున్నట్టు కాకుండా, ఎక్స్ ప్రెషన్ బేస్డ్ గా చాలా నీట్ గా ఉంది డాన్సు అన్ని పాటల్లో. అన్నిటికంటే ముఖ్యం గా చరణ్ డ్రెస్సింగ్ గాని అప్పియరెన్స్ గాని సూపర్ గా వున్నాయి. జెనిలియా చరణ్ గ్లామర్ ముందు సరితూగలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే "చెర్రీ" ఈ సినిమా లో "ఆపిల్" లా వున్నాడు.

అనాలిసిస్:
ముందే చెప్పుకున్నట్టు గా, రామ్ కి లాంగ్ లవ్ మీద నమ్మకం వుండదు. లవ్ కొంత కాలం మాత్రమే బాగుంటుంది, ఆ  తరువాత బోర్ కొట్టటం స్టార్ట్ అవుతుంది .. ఆ టైం కి ఒకరికి ఒకరు టాటా చెప్పుకుని విడిపోవాలి అనే థియరీ చెపుతూ ఉంటాడు. ఇదే విషయం మీద తన అక్క బావలకి కూడా సలహా ఇస్తాడు, విడిపోమని ... రోజూ ఏదో ఒక గొడవతో కలిసి వుండడం కంటే విడిపోవడమే బెటర్ కదా అని సలహా కూడా పారేస్తాడు. షార్ట్ లవ్ అంటే, మన కారు హెడ్ లైట్ నమ్ముకుని రాత్రి  డ్రైవ్ చెయ్యడం లాంటిదని... అదే లైఫ్ లాంగ్ లవ్ చేస్తామని ఎవరైనా అంటే .. అది  చీకట్లో మన హెడ్ లైట్ ఆర్పుకుని  ఎదుటి వాడు కారు హెడ్ లైట్ ఆధారం గా డ్రైవ్ చేయడం లాంటిదని ప్రాక్టికల్ గా జాను కి చూపిస్తాడు.

ఈ రకమైన మైండ్ సెట్ కి రామ్ కి వున్న ఒకానొక లవ్ ఫైల్యూర్ కారణమని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ... ఆ స్టోరి లో రామ్ రూబ అన్న ఒక అమ్మాయి ని ప్రేమిస్తాడు ... పెద్దలు ఒప్పుకుని సరే అనే వరకు వెళుతుంది ఆ కథ. ... కాని కాలం గడిచేకొద్దీ .. రూబ తనకు సంబంధించిన ప్రతి విషయం లోను జోక్యం చేసుకుంటుంది ... తనని సంతోషపెట్టడం కోసం అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు రామ్... దానివల్ల తనని తాను మెల్ల మెల్లగా కోల్పోతున్నానని గ్రహిస్తాడు .... రూబ ని జీవితాంతం అలా ప్రేరేమిస్తూ సంతోషం గా వుంచడం కోసం తను లైఫ్ లాంగ్ అలా అబద్ధాలు ఆడుతూ తనని తాను పూర్తిగా కోల్పోలేనని, అందువల్ల రూబ తో లవ్ ని కట్ చేసుకోవడానికి  నిర్ణయించుకుంటాడు. అలా చేసినతరువాత మళ్ళీ ఇదివరకటిలా సంతోషం గా ఉండగలుగుతాడు.

ఎప్పుడైతే లవ్ లో పొసెసివ్ నెస్ మొదలవుతుందో , అప్పుడు క్రమంగా లవ్ కరగడం మొదలై ఒకరి నుండి మరొకరికి ఎక్స్.పెక్టేషన్స్ పెరగడం మొదలవుతాయి. చికాకులు మొదలవుతాయి. ఎప్పుడైతే ప్రతీ లవ్ ఈ పాయింట్ కు చేరుకుందో, అప్పుడే ఆ లవ్ ని ఎండ్ చెయ్యాలి అనేది రామ్ ఫిలాసఫీ. ఇక్కడొక చిన్న విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలి. వివేకానందుడు తన జీవితం లో ఒక సంఘటనను చెప్తూ ... లవ్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు ... ఒక సారి వివేకానందుని అతని స్నేహితురాలితో కలిసి ఒక చెరువు పక్కగా నడుస్తూ వుండగా, ఆ స్నేహితురాలు చెరువులోనుండి నీటిని తన దోసిలి లో తీసుకొని వివేకానందుడితో అంటుంది ... "చూడండి ... ఈ నీరు ఎంత స్వచ్ఛము గా మెరుస్తోందో...ఇదే ప్రేమంటే అని..." అప్పుడు  వివేకానందుడు ఇలా కొనసాగిస్తాడు ..."ఆ స్వచ్ఛమైన ప్రేమ అలా స్వేచ్ఛగా ఉంటేనే ఎప్పటికి నిలుస్తుంది ... ఎప్పుడైతే నువ్వు పిడికిలి బిగించాలని చూసావో ... అది నీ వేళ్ళ మధ్యన తను బయటపడగల మొట్టమొదటి ఖాళీ ని వెతుక్కొని ... జారిపోతుంది. అలాగే ఏ క్షణాన ఐతే నువ్వు నీ ప్రేమ ని బంధించి ఇది నాకు మాత్రమే సొంతం అని  అనుకోన్నావో .. అదే క్షణం ఆ ప్రేమ నీ నుంచి తప్పించుకుపోతుంది " అని. తిరిగి రామ్ ఫిలాసఫీ లోకి వస్తే ... ఎప్పుడైతే మనం పైన అనుకున్న పాయింట్ కి ఎప్పుడైతే ప్రేమ వచ్చిందో ... అప్పుడు విడిపోవడం బెటర్ .. అలా కాకుండా ... మనం జీవితాంతం ప్రేమిన్చుకుంటూనే వుంటాం అన్న భ్రమ లో బతకడం అనవసరం అని.

మరి ఇంత రీజనింగ్ వున్నప్పుడు మళ్లీ ఎందుకు జాను ప్రేమని వదులుకోలేక పోయాడు ? మనిషికి జీవితంలో ఎప్పుడూ రెండు చాయిస్ లు దొరుకుతుంటాయి. అలా దొరికిన ప్రతీసారి ... దేన్ని ఎంచుకుంటే మనం ఎక్కువ ఆనందం గా వుండగలమో తెలుసుకొని ఆ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతాం. ఉదాహరణకి , T V  లో మంచి ప్రోగ్రాం వస్తోంది ... కాని రేపు పరిక్ష ఉంది ... చదువుకోవాలి ... ఏది ఎక్కువ ఆనంద దాయకమో దానిని ఎంచుకుంటాం ... కాని ప్రోగ్రాం చూద్దాం అని అనుకుని .. రేపు పరిక్ష బాగా రాయకపోతే ఏడవకూడదు ... ప్రేమ ఆనందాన్ని ఇస్తున్నంతసేపు దాన్ని ఎన్నుకున్నాడు .... ఎపుడైతే ఆనందం దొరకట్లేదో ... అప్పుడే నిర్దాక్షణ్యం గా వదిలేయాలి అనుకున్నాడు ... అదే చేసాడు ... ఎందుకంటే ... అక్కడ తనకు దొరకే ప్రేమకన్నా .. తను కోల్పోవలసింది ఎక్కువ కాబట్టి... వదిలేసిన ప్రతీసారి ... ఆనందం గానే వున్నాడు ... పరిక్ష రాసేముందు TV చూసిన పిల్లాడిలాగా ఏడవలేదు ... ఎప్పుడైతే జాను ప్రేమ తనకి తనకన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని గ్రహించాడో ... ఆ క్షణమే జాను గురించి ఏమి వదులుకోవడానికైనా  సిద్ధపడ్డాడు. లైఫ్ లాంగ్ ప్రేమించినా తన దానివల్ల తను పొందే ప్రేమవల్లె ఎక్కువ ఆనందమని నిర్ణయించుకున్నాడు ...అటు వంటి   ప్రేమ వైపు అడుగేసాడు ...

మరి కన్ఫ్యూషన్ ఎక్కడ వచ్చింది? .... ఈ మూవీ ని చూసే వాళ్ళలో చాలామంది ఏదో ఒక పాయింట్ లో తమని తాము ఐడెన్టిఫై చేసుకుంటారు ... రామ్ కి వున్న క్లారిటీ వాళ్లకి వుండదు ... రామ్ ఆడించిన truth or dare గేమ్ లో తమని తాము ఊహించుకుంటే తెలిసొచ్చే నిజం  చేదు గా వుంటుంది ... ఎవడైనా మనగురించి నిజం  చెప్తే (మనకి నచ్చనిది) ముందు చిరాకొస్తుంది, తర్వాత కోపం వస్తుంది ... "యదార్ధ వాది లోక విరోధి" అన్న సామెత ఉండనే ఉందిగా ... సో ఫైనల్ గా సినిమా అంతా కన్ఫ్యూషన్ అని అనుకుని తృప్తి పడతారు ...

అంతా బాగానే తీసాడు కాని, భాస్కర్ ఓకే ఒక తప్పు చేసాడు.... ఈ సినిమా ని తెలుగులో కాకుండా ఏ తమిళ్ లోనో తీసుంటే బాగుండేది ... అక్కడ సూపర్ హిట్ అయ్యాకా చక్కగా తెలుగులోడబ్బింగ్  చేసుకుని , చొక్కాలు చింపుకుని మరీ సినిమా చూసి ... ఎంతో పెద్ద హిట్ చేసేవాళ్ళం కదా ....ప్చ్ ...  పూర్ ఫెలో !.... అనవసరం గా తెలుగు ప్రేక్షకుల్ని నమ్ముకున్నాడు ...



21 Nov 2010

5 Why అనాలిసిస్

ఏ విషయమైనా మనకి పరాయి దేశం వాడెవడైనా చెపితే అందరం ఎగేసుకుంటూ అదో పేద్ద Management lesson లాగ ఫీలై తు.చ తప్పకుండా అమలుచేసేస్తాం. ఇది మనవాళ్ళు ఎప్పుడో చెప్పార్రా నాయనా అంటే వినిపించుకోం, సరికదా ఇంకా కావలసినంత వెటకారం చేస్తాం,  "మన వేదాల్లో అన్నీ ఉన్నాయష !" అనే "కన్యాశుల్కం" డైలాగ్  ను గుర్తుతెచ్చుకుని మరీ.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, మొన్న ఈ మధ్యన ఆఫీసులో ఏవో Management విషయాలు చెప్తూ ఈ 5 Why అనాలిసిస్ గురించి, అబ్బో తెగ చెప్పారులెండి. ఈ టెక్నిక్ సమస్యల మూల కారణం (root cause)  కనుక్కోవడానికి వాడే ఒక పద్ధతని, దీన్ని కనిపెట్టింది జపాను దేశస్తుడని, ప్రముఖ కార్ల తయారీ సంస్థ Toyota ఈ టెక్నిక్ ని మొట్టమొదట గా అనుసరించి లాభ పడిందనిన్ని. ఏదైనా ఒక సమస్య మూల కారణాన్ని తెలుసుకోవాలంటే, ఐదు సార్లు "ఎందుకు?" (why?) అని ప్రశ్నించుకోవాలట  .మరిన్ని వివరాలకు ఈ వికిపీడియా లింక్ ను సందర్శించండి : http://en.wikipedia.org/wiki/5_Whys

దీని గురించి వినగానే, నాకు చిన్నప్పుడు విన్న ఒక కథ జ్ఞాపకం వచ్చింది. నేను విన్న, నాకు గుర్తున్న మొట్టమొదటి కథ అది. బహుశా అందరికి అంతేనేమో. ఆ కథ మరేదో కాదు, ఏడు చేపల కథ. మరిచిపోతే గుర్తు చేసుకోవడం కోసం మళ్లీ ఆ కథ ని ఈ క్రింద రాస్తున్నాను.

అనగనగా రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు ఒకరోజు వేటకు వెళ్లి ఏడు చేపలను తీసుకొచ్చి ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదు? అని అడిగితే, గడ్డి అడ్డొచ్చింది అని చెప్తుంది. గడ్డి గడ్డి ఎందుకు అడ్డు వచ్చావ్? అని అడిగితే, ఆవు నన్ను మేయలేదు అని చెప్తుంది. ఆవు ఆవు ఎందుకు మేయలేదు? అని అడిగితే, కాపరి నన్ను గడ్డి మేయటానికి వదలలేదు అని చెప్తుంది. కాపరి కాపరి ఆవుని ఎందుకు వదలలేదు? అంటే, నన్ను చీమ కుట్టింది అని చెప్తాడు. చివరికి చీమని , చీమ చీమ ఎందుకు కుట్టావ్? అని అడిగితే, "నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా?" అని చక్కా చెప్పి జారుకుంటుంది. సో, రాజుగారబ్బాయిలు తెచ్చిన ఏడవ  చేప ఎండక పోవడానికి కారణం, పశుల కాపరి చీమ పుట్టలో వేలుపెట్టడం అన్నమాట.

సరిగ్గా లెక్కపెడితే, పైన కథ లో కూడా కర్రెక్ట్ గా ఐదు "ఎందుకు?" లు వుంటాయి. అంటే ఈ 5 వై అనాలిసిస్ లు ఈ రాజు గారి కథలు మనకి ఎప్పటివంటారు?  ఇటువంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మన పెద్దలు ఏనాడో ఏర్చి కూర్చి చిన్న చిన్న కథల రూపంలోనూ, ఆచార వ్యవహారాల రూపంలోనూ పొందు పరచి గోరుముద్దల వయసునుంచే మనకు అందించారు. పెద్ద  పెద్ద పేర్లు పెట్టకుండానే మన బుర్రల్లోకి సూటిగా దూరిపోయే  విధంగా ఆలోచించారు. ఇవ్వాళ ఎంత మంది పిల్లలకు ఆ సనాతన వారసత్వ సంపదను కానుకగా అందివ్వగల్గుతున్నాం? ఇవ్వాళ పిల్లలు "నాన్నా చేప అంటే ఏమిటి?" అని అడిగితే, "చేప అంటే Fish కన్నా" అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో వున్నాం. ఒక పెద్ద బాల శిక్షలేదు, సుమతి వేమన శతకాలు లేవు, పంచతంత్ర కథలు తెలియవు, చందమామ కథలు లేవు, ఒక పద్యం లేదు, పాట లేదు. తెలుగు అంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్ , పద్యం అంటే పాత చింతకాయ పచ్చడి, హనుమాన్, గణేశ అంటే కార్టూన్ లో పాత్రలు ఇవ్వాళ రేపు చిన్నారులకి. పుస్తకాలు కథలు చదివి మానసిక వికాసం పొందాల్సిన వయసులో, కార్టూన్ల పేరిట ప్రపంచం లో ఉన్న చెత్తనంతా పిల్లలకు అందివ్వగలుగుతున్నాం  ఇవ్వాళ."Harry Potter" అంటూ పిల్లా పెద్దా అందరూ ఊగిపోతూ చదివేస్తున్నారు, సినిమా చూసేస్తున్నారు మరి వారిలో ఎవరికైనా "సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి" కథ లోని రుచి తెలుసా? ఎప్పుడైనా ఈ పేరు వినివుంటారా?

వికాసం సాధించవలసిన వయసులో పిల్లలకి నానా చెత్తని అందించి, మన చందమామ కథల్ని చిన్న చిన్న విషయాలను పశ్చిమ దేశాలనుండో, ఈశాన్య దేశాలనుండో ఎవడో వచ్చి షుగర్ కోటింగ్ లాంటి ఇంగ్లిషు పలుకులతో మనకి ఉపదేశిస్తే ... ఆహా ఎంత గోప్ప విషయాన్ని కనుగొని సెలవిచ్చారు? అని వాళ్ళని వేనోళ్ళ పొగుడుతూ వాళ్ళకి దాసోహమంటూ ఎంత గొప్ప ప్రగతిపథంలో దూసుకుపోతున్నాం మనం... గ్లోబలైజేషన్ నేపథ్యం లో ప్రపంచం లో అన్ని రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, రచనలు, భావనలు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. అవన్నీ దూరంపెట్టమని అనటం లేదు. కాని వాటి ప్రభావానికి లోనై మనల్ని మనం మరచిపోకూడదు.

29 Mar 2010

మిస్టర్ ఎస్కేపిస్ట్

ఇవ్వాళ రాత్రి మా అమ్మ, నాన్న గారు, చెల్లెలు గౌతమి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి సికిందరాబాదు నుంచి నిడదవోలు వెళ్ళవలసి వుంది. రాత్రి తొమ్మిదింపావు కి ట్రైన్. ఎనిమిది యాభైఐదు కల్లా స్టేషన్ కి వెళ్లి ఎస్ వన్ కంపార్ట్ మెంట్ లో మా వాళ్ళకి కేటాఇంచిన ఒకటి, మూడు, నాలుగు సీట్లలో (రెండు లోయర్ , ఒకటి అప్పర్ బెర్త్) కుర్చోపెడదామని బోగీ ఎక్కాను. మా అమ్మగారి వయసు యాభై ఐదు. పైగా స్థూలకాయం. దానికి తోడు నడుము మరియు మోకాళ్ళ నొప్పులు. అప్పర్ / మిడిల్ బెర్త్ లు ఎక్కలేరు. మా చెల్లెలు ఆరు నెలల ప్రెగ్నెంట్. తను కూడా పై బెర్త్ లు ఎక్కడం కష్టం అని ముందుగానే రిజర్వేషన్ దొరికినా రెండు లోయర్ బెర్త్ లు దొరక్కపోవడం వలన దానిని కాన్సిల్ చేసి తత్కాల్ లో మళ్ళీ రెండు రోజులముందే రిజర్వేషన్ చేఇంచాను.

బోగీ లోనికి ఎక్కేసరికి నాలుగవ నంబరు బెర్త్ లో ఒక పెద్దాయన కూర్చుని వున్నారు. మోకాలికి ఆపరేషన్ అయిందట ముందురోజే. కాలుకి బాండేజీ తో కూర్చుని వున్నారు. అయన భార్య కూడా ఆయనతో ప్రయాణిస్తోంది. ఆయనను ఎక్కించటానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు మా కూపే అంతా ఆక్రమించుకుని వున్నారు. దాదాపు యాభై ఏళ్ళ వ్యక్తి, ఆయన భార్య, వారి  కుమారుడు, దాదాపు పాతికేళ్ళ పైన ఉంటాయి, ఆ ఆపరేషను ఐన పెద్దాయనను వారి భార్యను ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు. మొత్తానికి ఎలాగైతేనేం వారిని క్రిందకు దింపి మా సీట్లలో మావాళ్ళని కూర్చోపెట్టబోయా. రెండు లోయర్ బెర్త్ ఒక దానిపై కాలికి కట్టు తో వున్న పెద్దాయన వున్నాడు. మరొక బెర్త్ లో ఒకాయన విండో సీట్ వద్ద చక్కగా కూర్చుని మమ్మల్ని చూస్తున్నాడు. ఇంక నేను అది మాకు కేటాయించిన సీట్ అని ఆయన్ని తన సీట్లో కూర్చోమని చెప్పవలసి వచ్చింది. ఏదో ఆయన సొమ్మంతా మేము లాగేసుకుని వెళ్ళగొట్టినట్టుగా సణుక్కుని ఆయన లేచాడు. ముందు మా చెల్లెలిని అక్కడ విండో సీట్ లో కూర్చోపెట్టి సామానంతా సద్ది, మా అమ్మ నాన్న లను కూడా సీట్ లలో కూర్చోబెట్టి, రెండో లోయర్ బెర్త్ సంగతి గురించి ఆలోచించటం మొదలు పెట్టాను.

కాలుకి కట్టు తో వున్న పెద్దాయనను అడిగాను, వారిది ఏ బెర్త్ అని. మూడు, నాలుగు అని ఆయన టిక్కట్టు  చూపించాడు. ఇదెక్కడి గొడవరా బాబూ , మూడు నాలుగు మనవి కదా ... ఈయనవి  అని టిక్కట్టు లో ఉందేమిటి అని అనుకుంటూ బొగీ కి వున్న చార్ట్ చూసాను. మావాళ్ళ పేర్లే వున్నాయి. మళ్ళీ అయన టిక్కట్టు చూసాను. ఆయనది ఎస్ ఎల్ వన్ బోగీ. గార్డు బొగీ తో వుండే బొగీ అది. వికలాంగులకు కేటాఇంచే కోటా ఆ బొగీ లో వుంటుంది. ఆ విషయం తెలీక వారిని ఎక్కించడానికి వచ్చిన ముగ్గురు ఆయన్ని భార్య ని ఈ బొగీ లో (ఎస్ వన్ లో )ఎక్కించేసారు. ఇదీ విషయం అని వారిని ఎక్కించడానికి వచ్చిన వారికి చెప్పాను. ట్రైన్ కదలడానికి ఇంకా పది నిమిషాల పైన టైం వుంది, గార్డు ని టి సి ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఆ బొగీ లో ఎక్కించే ఏర్పాటు చేయమని చెప్పాను. ఆయనని మళ్ళీ కదల్చడం చాలా కష్టం అని అడ్జస్ట్ అవమని అన్నాడు, చాలా తేలికగా. అదెలా కుదురుతుంది, వారు ఆక్యుపై చేసుకున్న బెర్త్ కి బదులు వేరొకరిది చూపించమని, లేదా ఎవరినైనా ఇద్దరినీ ఆ బొగీ కి వెళ్ళమని రిక్వెస్ట్ చేయమని చెప్పాను. మా అమ్మగారు చెల్లెళ్ళు వెళ్ళే స్థితిలో లేరు, మా నాన్న గారు వెళ్ళని ఇక్కడ వదిలి వెళ్ళడం కష్టం, ఎందుకంటే తెల్లవార ఝామునే నాలుగున్నరకి ట్రైన్ దిగాలి, లగేజి కూడా చాలా వుంది. నేను వుండి వుంటే నేనైనా కనీసం వెళ్ళే వాడిని. నేను వీళ్ళని ఎక్కించడానికి మాత్రమె వచ్చాను ఏదో ఒకటి చేయమని చెప్పాను.

సైడ్ లోయర్ బెర్త్ అడిగి అడ్జస్ట్ చేస్తానని, కొంచెం సేపు ఆగమని అడిగాడు. ఇంతలో ఇందాకా విండో సీట్ దగ్గరనుండి సణుక్కుంటూ వెళ్ళిన వ్యక్తి, అది పోలీసులదని వాళ్ళు ఇవ్వరని చెప్పాడు. పైగా ట్రైన్ కదలితే వాళ్ళే సద్దుకుంటారని, ఎవరో ఒకరు బెర్త్ అడ్జస్ట్ చేసుకుంటారని ఉచిత సలహా పడేసాడు. సరే ఐతే, ఆ లోయర్ బెర్త్ బదులు కనీసం మిడిల్ బెర్త్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది ఐన ఇప్పించమని వాళ్ళతో వచ్చిన యువకుడికి చెప్పాను. వాళ్ళు ఎవరూ రాలేదని, రాగానే అలాగా అడుగుతానని కొంచెం విసుగ్గా అన్నాడు. ఇంతలో, ఇందాకా ఉచిత సలహా పడేసినాయన, మిడిల్ , అప్పర్ లు  నా బెర్త్ లు , నేనెందుకు ఇస్తాను అనిచెప్పి చక్కా పోయాడు. ఈ గొడవ జరుగుతుండగా వీళ్ళని ఎక్కించడానికి వచ్చిన ముగ్గురిలో, ఆ యువకుడి తండ్రి జారుకున్నాడు. ఆయన మొదట్లో మమ్మల్ని సద్దుకోమని సర్దిచెప్పబోయాడు. అది కుదిరే వ్యవహారం కాదని మెల్లగా అక్కడినుండి తప్పించుకున్నాడు. ఆ యువకుడికి తను అక్కడ బుక్ అయిపోయాను అని చాలా బాధగా ఉంది. ఏదైనా తొందరగా చేయండి, ఎవరినైనా రిక్వెస్ట్ చేయండి అని నేను తొందర చేసాను. అటుగా వచ్చిన పోలీసులని సైడ్ బెర్త్ ఇమ్మని అడిగాడు. పోలీసులు ససేమిరా అని నా కళ్ళముందే అన్నారు. కాని పోలీసులు ఆ బెర్త్ ఇస్తానన్నారని నన్ను మభ్యపెట్టచూసాడు. ఎవరినైనా ఇద్దరినీ ఆ బొగీ లోకి వెళ్ళమని రిక్వెస్ట్ చేయమని మళ్ళీ ఈ సారి గట్టిగా చెప్పాను. నా మీద కోపం ప్రదర్శించాడు ఆ యువకుడు. తానేమీ చెయ్యలేనని, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారని అన్నట్టు గా చాలా విసురుగా సమాధానం చెప్పాడు. పైగా కొంచెం టైం పడుతుంది , ట్రైన్ కదలనివ్వండి, అడ్జస్ట్ చేస్తాను అని అన్నాడు. ఐతే అతను కూడా వారితో వస్తున్నాడా అని అడిగాను. తను రావట్లేదట. నాలాగే తన వాళ్ళని రైలు ఎక్కించడానికి వచ్చాడట. మరైతే ట్రైన్ కదిలాక ఎలా సెటిల్ చేస్తావ్ అని స్వరం పెంచి అడిగాను. ఇంక విధి లేనట్లుగా ఇద్దరు ముగ్గురుని అడిగి కాదనిపించుకొని, వచ్చి చెప్పాడు. ఎవరూ వెళ్ళడానికి వోప్పుకోవట్లేదని. ఇంతలో ఆ యువకుడి తల్లి కిందనుంచి అరుస్తోంది... "బుజ్జీ నువ్వు ట్రైన్ దిగై ... కడులుతుందేమో .... వాళ్ళు చూసుకుంటారులే (??!!)" అని. అప్పటికి కూడా ఆ యువకుడికి మళ్ళీ చెప్పడానికి ట్రై చేసాను. గార్డుకి, టి సి కి చెప్పి వీల్ చైర్ తెప్పించి వాళ్ళ బొగీ లో కూర్చోపెట్టి రమ్మని, రిక్వెస్ట్ చేస్తే ట్రైన్ కొన్ని నిమిషాలు ఆపుతారని, నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి చూసాను. నా మాట పట్టించుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ట్రైన్ కదిలే వరకు కాల యాపన చేసాడు. టి సి కి చెపితే ఆయన కూడా తీసుకెళ్ళి ఆయనకు కేటాయించిన బొగీ లో కూర్చోపెట్టమనే సలహా ఇచ్చాడు. చివరికి అటూ ఇటూ తిరుగుతూనే ట్రైన్ కదిలే వరకూ కాలయాపన చేసాడు. ఇంక చివరగా నేనేమీ చేసేదిలేక, టి సి కి కంప్లైంట్ చేయమని , మన బెర్త్ లు మనకి కావాలని ఆయనతో చెప్పమని, అది ఆయన పరిష్కరిచవలసిన విషయమని మా నాన్న గారికి చెప్పి వీడ్కోలు చెపుతూ భారం గా బయటకు వచ్చాను. ఇంతలో ఎవరో ఒక పేద్ద ఫ్యామిలీ , దాదాపు పది మంది దాకా వుంటారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి బండి కదిలే సమయానికి వచ్చారు. వారు వచ్చే సమయానికి గార్డు పెట్టె వాళ్ళని దాటుతోంది. గట్టిగా కేకలు పెట్టారు. బండి ఆగింది. వారు వారి బొగీ ల్లోకి ఎక్కాక మళ్ళీ కదిలింది.

ఏదైనా విపత్కర పరిస్తితి వస్తే మనకి ఎంత ఇబ్బందిగా వున్న సద్దుకుంటాం. అవతలివారికి సహాయ పడతాం. కాని అవతలివారికి మనలని ఇబ్బంది పెట్టవలసిన ఆవశ్యకత లేకపోయినా, వారి అలసత్వం వల్ల చేసిన తప్పిదాలవల్ల మనలని ఇబ్బంది పెడుతూ సద్దుకోమని ఉచిత సలహా పడేయటం ఎంతవరకు సమంజసం? నిజానికి ట్రైన్ ఎక్కినా పెద్దాయనను చూస్తె మానవీయ కోణంలో మనం సహాయ పడవలసిందే. నేను ఆ ట్రైన్ లో ప్రయాణిస్తుంటే కనీసం నేనైనా సద్దుకునేవాడిని. కాని ప్రెగ్నెంట్ అయిన నా చెల్లెలిని, పెద్ద వాళ్లైన నా తల్లి తండ్రులను నేను సద్దుకోమని చెప్పలేను. వాళ్ళని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కూడా. వేరొక బెర్త్ అదే బొగీ లో ఎక్కడో ఒకచోట వుంటే ఎలాగో ఆయాసపడి సద్దుకోవచ్చు. అసలు బెర్త్ లేకుండా మన బెర్త్ వేరొకరికి ఇచ్చి, వారికి వెళ్ళే అవకాశం వుండికూడా వారితో వచ్చిన వాళ్ళు తప్పించుకొని తిరిగి ఎస్కేపిస్ట్ ల లా ప్రవర్తిస్తే ఏమి చేసేది. పైగా తన సీట్ కాకుండా పక్క సీట్ ని ఆక్యుపై చేసుకుని కూర్చుని, లేవమంటే బాధపడే వ్యక్తి   కూడా ఉచిత సలహాలు ఇస్తూ, తనదాకా వచ్చేసరికి తప్పించుకున్నాడు.

ఒకటి వచ్చిన వ్యక్తులు తాము చేయవలసిన పనిని సక్రమంగా చేయలేదు. రెండు చేసిన తప్పును గుర్తించలేదు. మూడు వారి పొరపాటును చెప్పినప్పుడు దానిని సరిచేసుకోవడానికి ప్రయత్నించకుండా అవతలివారిని సద్దుకోవాలని చాలా విశాల హృదయం తో సలహా పారేశారు. నాలుగు , అసలు అవతలి వారి సాధక బాధకాలు ఏమిటి, వారికి సద్దుకునే అవకాశం ఉందా, సద్దుకునే పరిస్తితి ఉందా, వారికి ఇబ్బందిని కలిగిస్తున్నామా అన్న చింతన లేనే లేదు. ఐదవది, అసలైనది ... తాము చేసిన వెధవ పనికి తమ వాళ్ళు కూడా సఫర్ అవ్వాలన్న ఇంగిత జ్ఞానం ఏ మాత్రం ఏ కోశానా లేదు, కనపడలేదు. ఎప్పుడు ట్రైన్ కదులుతుందా, ఈ గొడవ వదులుతుందా, తప్పించుకుని పారి పోదామా అనే తప్ప. పెద్ద వయసు గల తండ్రి సరే, బాధ్యతా యుతం గా ఉండవలసిన ఆ యువకుడుకూడా చాలా అసహనం గా, ఎస్కేపిస్ట్ లా ప్రవర్తించాడు. మన దేశం మంచి దేశం గా కీర్తి సంపాదించడానికి దేశం లో పౌరులు, యువతీ యువకులు, దేశ విదేశాలకు పోయి భారత దేశ కీర్తి పతాకని ఎగురవేయవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు కనీసం భాద్యతాయుతమైన పౌరునిగా ప్రవర్తించి, తనకు ఎదురైన సవాళ్ళను అధిగమించి తానెదుర్కొన్న సమస్యలను పరిష్కరించుకొనగలిగితేచాలు ... ఎంతో మందికి ఎన్నో దేశాల వారికి మనం మార్గ దర్శకులమవుతామనడంలో అతిశయోక్తి లేదు.

నాకు ఇవ్వాళ తారసపడిన ఎస్కేపిస్ట్ ల లాగానే చాలామంది వున్నారు. వారందరికీ నా సందేశం ఒక్కటే . Get Well Soon Mr Escapist !!!!. ఇంకెందుకాలస్యం. మీరుకూడా మీ కామెంట్ లో మీ సందేశాని జత చేసి పోస్ట్ చేయండి.

                           ఇక ఉంటా మరి ... ఇప్పటికే అర్థరాత్రి దాటింది ...
                                                            బాలు

p.s. ఇప్పుడే అందిన వార్త. ట్రైన్ లో ఆ పెద్దాయన వాళ్ళు అక్కడ కూర్చోకూడదని టి సి కూడా గట్టిగా చెప్పాడట. ఆయన ఎలాగూ పడుకోలేదు. కూర్చోవడమే కాబట్టి రెండు బెర్త్ లమధ్య ఖాళి స్థలం లో పక్క వేసి కూర్చోవడానికి మా నాన్న గారు మరొకరు కలిసి ఏర్పాటు చేసారట. ఆయన బెర్త్ కంటే ఆ ఏర్పాటే సుఖంగా వుందని హాయి గా కూర్చున్నాడట. ఆ పెద్దావిడ, మా అమ్మ గారు చెల్లెలు రెండు లోయర్ బెర్త్ లలో రొటేషన్ పద్ధతిమీద సద్దుకుని పడుకున్నారట. హమ్మయ్య ... అందరూ సౌఖ్యమే .... ఎస్కేపిస్ట్ లు తప్ప.

9 Feb 2010

ప్రతి దినం ... గీతావందనం ... (8,9)

నేటి శ్లోకాలు గీతలో ఎనిమిది మరియు తొమ్మిదవ శ్లోకాలు 


భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ ||


యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మనసైన్యమందున్నారు.


అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||


నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరూ పలువిధములైన ఆయుధములను దాల్చిన వారును మరియు యుద్ధ నిపుణత కలిగిన వారునూ అయి వున్నారు. 


పాపియైన దుర్యోధనుని పక్షము వహించియున్నందున , దుర్యోధనుడు పైన పేర్కొన్న వీరులందరునూ కురుక్షేత్ర యుద్ధములో మరణించి తీరతారు అని ముందే నిర్ణయింపబడివుంది. కాని దుర్యోధనుడు మాత్రం పైన తెలుపబడిన సంఘటిత శక్తి వల్ల తనకు విజయము తప్పక లభించునని ధైర్యముతో ఉన్నాడు. 


మరలా కొత్త శ్లోకంతో పునర్దర్శనం రేపు ...సెలవు ...

7 Feb 2010

ప్రతి దినం ... గీతావందనం ... (6,7)

నేటి శ్లోకాలు గీతలో ఆరు మరియు ఏడవది ....


యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||


పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి ఐన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదికుమారులును అందున్నారు. ఈ వీరులందరు మహారథులు.

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||

కాని ఓ బ్రాహ్మణోత్తమా ! నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులనుగుర్చి మీ కొరకు నేను తెలియచేసెదను.  

ఈ విధముగా దుర్యోధనుడు పాండవ సేనల బలాబలాలను ఏకరవు పెట్టిన తదుపరి , వారిని ఎదుర్కోవడానికి తమ సేనలలో ఉన్న వీరుల గురించి ద్రోణునికి వివరించడానికి పూనుకొన్నాడు.

2 Feb 2010

కామెంట్ ప్లీజ్ ..... (1)

[ చూడగానే విలక్షణం గా కనిపించే ఫొటోలకి, రెండు లైన్లలో మీ కామెంట్ ని రాయండి ... ఫోటో ను జత చేస్తూ నేనొక రెండు లైన్ల కామెంట్ తో మొదలు పెడతాను .. ]


ఇదిగో నా కామెంట్ ... :-)
బూరెబుగ్గల బుజ్జాయి ...
ఎందుకా అచ్చెరువోయి ....

నవ్వేజనాః సుఖినోభవంతు .... (1)


ఎవరు గొప్ప ?


అనగనగా...ఒకచోట  ప్రపంచంలో ఎవరు గొప్ప పోలీసులో తెలుసుకొనేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అమెరికా పోలీసులు, రష్యా పోలీసులు, స్కాట్లాండ్ యార్డు పోలీసులు ఇంకా మనవాళ్ళ మధ్యన ఆ పోటీ. ఒక చిరుతపులిని దట్టమైన అడవులలోకి వదిలిపెడతారు. దాన్ని ఎవరైతే తక్కువ టైం లో వెతికి తీసుకువస్తారో వారే విజేతలు. 


మొదటగా అమెరికా పోలీసులు వెళ్ళారు. ఒక గంటలో చిరుతను వెనక్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత రష్యా వాళ్ళు 40 నిమిషాలలోనే ఆ పనిని చేసి అమెరికన్లను చూసి కాలరెగరేసారు. ఆ తర్వాత వెళ్ళిన  స్కాట్లాండ్ యార్డు పోలీసులు అరగంట లోనే చిరుతని వెనక్కి తీసుకొచ్చి రష్యన్ల వేపు పరిహాసంగా చూసారు. 


ఇక తరవాత వంతు మన వాళ్ళది. స్కాట్లాండ్ యార్డు పోలీసుల కంటే తొందరగా మన వాళ్ళు చిరుతని వెతికి తీసుకొస్తారా లేదా అని అందరూ ఉత్కంటతతో ఎదురు చూస్తున్నారు. పదిహేను నిమిషాలు గడిచాయి ..... ఇరవై నిమిషాలు గడిచాయి .... అరగంట కూడా ఐపోయింది .... మనవాళ్ళ జాడ ఎక్కడా లేదు .... గంట గడిచింది ... రెండు గంటలైంది .... ఎక్కడా అలికిడి లేదు ... ఏమైందో చూద్దామని మిగిలిన వాళ్ళందరూ అడవిలోకి వెళ్లి వెతకసాగారు. 


వెతకగా వెతకగా .. మనవాళ్ళు ఒకచోట కనబడ్డారు. అక్కడొక ఎలుగుబంటి చెట్టుకి కట్టేసివుంది. మనవాళ్ళందరూ దాని చుట్టూచేరి కర్రలు పట్టుకుని చితకబాదుతూ ఇలా అరుస్తున్నారు ... "ఒప్పుకో .... నువ్వే చిరుతపులివని ఒప్పుకో .... ఒప్పుకుంటావా లేదా ... " !!??

1 Feb 2010

ప్రతి దినం ... గీతావందనం ... (5)

నేటి శ్లోకం గీత లో  ఐదవది .....

ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్  కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||


ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి నరోత్తములైన మహా యోధులున్నారు.


దుర్యోధనుడు గొప్ప రాజనీతి నిపుణుడని ఇదివరకే చెప్పుకున్నాం. యుద్ధము ఆరంభమయ్యే ముందు తన శత్రుసైన్య బలాబలాలను అంచనా వేస్తూ, గురువు సేనాధిపతియైన ద్రోణునికి హెచ్చరిక చేస్తున్నాడు.

31 Jan 2010

చిన్న కథ ... (1)

[ ఈ కథలు నేను విన్న, చదివిన మనసుకు హత్తుకున్న చిన్ని చిన్ని కథలు. మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ  పొందుపరస్తున్నాను. ఇమేవీ నా సొంతం కాదని మనవి ]

త్యాగం :

ఏమీ ఆశించకుండా ప్రేమించడం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఇది. ఇక చదవండి .....


పదేళ్ళ జాన్ తన చెల్లెలితో ఆడుకుంటూ ఉండగా. ఆ పాప పడిపోయి తలకు పెద్ద గాయం తగిలి చాలా రక్తం పోయింది. జాన్ ది తన చెల్లెలి గ్రూప్ రక్తమే. 

"నువ్వు నీ చెల్లెలికోసం కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు జాన్ ని. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు సరే అన్నాడు. ఆ కుర్రవాడి సంశయాన్ని డాక్టర్ మరోలా అర్థం చేసుకున్నాడు. " పెద్ద నొప్పిగా ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోతుంది "అని చెప్పాడు. 

తన శరీరంలోంచి రక్తం మెల్లమెల్లగా సీసా లోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గరకు  వచ్చి "లే చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు .. " ఇంకా ఎంతసేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్" అని. 

డాక్టర్ విభ్రాంతుడై, " రక్తం ఇస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నావా?" అని అడిగాడు.... దానికా కుర్రవాడు "అవును" అన్నాడు.

డాక్టర్ గొంతు వణికింది.... "అనుకునే ఇచ్చావా?" అన్నాడు కంపిస్తూ. 
అవును అన్నట్లు తలూపాడు జాన్, అమాయకంగా... 

***********************************

ప్రతి దినం ... గీతావందనం ... (4)

నేటి శ్లోకం గీత లో  నాల్గవది .....

అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||

ఈ పాండుపుత్రుల సైన్యమందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహా యోధులు. 

యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుడి గొప్ప శక్తిముందు ధృష్టద్యుమ్నుడు అవరోధము కానప్పటికీ, దుర్యోధనుని భయమునకు కారకులైన వారు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతిఒక్కరు కూడా భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటయే ఆతని భయమునకు కారణము. భీమార్జునుల శక్తి దుర్యోధనునికి తెలిసియుండుట చేతనే ఇతరులను వారిరువురితో పోల్చెను.

30 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (3)

నేటి శ్లోకం గీత లో  మూడవది .....

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యుఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||

ఓ ఆచార్యా ! బుద్ధికుశలుడు, మీ శిష్యుడు ఐన ద్రుపదపుత్రునిచే  వ్యుహముగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనా సమూహమును చూడుము. 

రాజ నీతి నిపుణుడైన దుర్యోధనుడు, బ్రాహ్మణుడు మరియు సైన్యాధిపతియగు ద్రోణాచార్యుని తప్పిదములను ఆధారముగా చేసుకొని రెచ్చగొట్టతలచుకొన్నాడు. అందువలనే ద్రుపదునికి ద్రోణునికి కల రాజకీయ వైరాన్ని గుర్తుచేసే విధంగా ద్రుపద పుత్రుడైన ధృష్టద్యుమ్నుని సైనిక వ్యూహము చే గొప్పగా ఉన్న పాండుపుత్రుల సేనలను చూడమనెను. ద్రోణున్ని గెలిచే పుత్రుడిని ద్రుపదుడు యజ్ఞమాచరించి పొంది, ఆ పుత్రుడిని ద్రోణునివద్దకే యుద్ధవిద్యలను నేర్చుకొనుటకు పంపగా, విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా ద్రోణుడతనికి యుద్ధ సూక్ష్మములను బోధించెను. ఇప్పుడా ధ్రుష్టద్యుమ్నుడే పాండవ పక్షము చేరి సైన్య వ్యూహములు సైతం రచించెను.  కనుక ద్రోణుడు రాజీ లేని ధోరణితో యుద్ధమాచరింపవలెనన్న ఉద్దేశముతో దుర్యోధనుడు ఆ విధముగా ద్రోణుని తప్పిదమును ఎత్తిచూపెను. 

29 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (2)

నేటి శ్లోకం గీత లో రెండవది .....

సంజయ ఉవాచ --
దృష్ట్వాతు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా !
ఆచార్యముప సంగమ్య రాజావచనమబ్రవీత్ ||

ధృతరాష్ట్రుని ప్రశ్న విని సంజయుడు ఈ విధముగా పలికెను : పాండవులచే వ్యుహముగా ఏర్పడిన బలగాలను చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు సమీపించి ఈ విధముగా పలుకుచుండెను.

అంధుడైన ధృతరాష్ట్రునికి బాహ్య దృష్టితో పాటు, ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధార్మిక విషయాలలో తన పుత్రులుకూడా తనతో సమానమైన ఆంధులని అతనికి తెలుసు. కాని కురుక్షేత్ర స్థల ప్రభావమువల్ల పాండవులతో రాజీకి ఏమైనా సిద్ధపడుతున్నారా అన్న సందేహముతో యుద్ధరంగమందు పరిస్థితిని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడని అర్ధంచేసుకున్న సంజయుడు రాజుని ఉత్సాహపరచే ఉద్దేశముతో, అక్కడ రాజీ వంటిది ఏదీ జరగటం లేదని, పాండవ సేనను చూసిన తదుపరి సేనాధిపతియైన గురువు ద్రోణునితో మాట్లాదతలచి దుర్యోధనుడు అతని చెంతకు వెళ్ళాడని ధృతరాష్ట్రునికి తెలియచేసాడు. 
 పాండవసేనలను చూసి పరిస్థితి యొక్క తీవ్రతను అర్ధం చేసుకొన్నవాడై , రాజైనప్పటికినీ దుర్యోధనుడు స్వయముగా సైన్యాధిపతి చెంతకు వెళ్ళవలసి వచ్చెను. ఈ సంఘటన దుర్యోధనుని రాజనీతిజ్ఞతను తెలుపుతూనే పాండవ సేనా వ్యూహము చుసినపిమ్మట అతనికి కలిగిన భయమునుకూడా బహిర్గతపరుచుచున్నది.

పునర్దర్శనం మరలా రేపు... సెలవు ...

28 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (1)

ప్రతి దినం ఒక గీతా శ్లోకం, దాని అర్ధం మరియు సంగ్రహం గా దాని వివరణ చెప్పుకుందాం .... 
నేటి శ్లోకం .... ( గీత లో మొట్ట మొదటి శ్లోకం తో మొదలు పెడుతున్నాము )

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః|
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

[ సంజయుడు వ్యాస మహర్షి శిష్యుడు. వ్యాసుని కరుణతో తానున్న ప్రదేశము నుండియే కురుక్షేత్ర యుద్ధమును చూడగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు సంజయునిని ఈ విధముగా అడుగుచుండెను ]

ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరి సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ?

ధృతరాష్ట్రుడు ఈ విధముగా అడుగుట లో ఒక ప్రాముఖ్యత వుంది. యుద్ధము జరుగు ప్రదేశము దేవతలకు సైతం పూజనీయ స్థానమైన కురుక్షేత్రం. స్వభావరీత్యా ధర్మాత్ములైన పాండవులకు ఆ కురుక్షేత్ర స్థల ప్రభావము అనుకూలముగా ఉంటుందని  అతనికి తెలుసు. అందువలన తన పుత్రులైన కౌరవుల యొక్క విజయావకాశాములపై అతనికి గొప్ప సందేహం ఉంది. అటువంటి సందేహముతోనే ధృతరాష్ట్రుడు సంజయుడిని " వారు ఏమి చేసిరి ?" అని ప్రశ్నిస్తున్నాడు. అధర్మ పరాయణులైన వ్యక్తులకు తాము ఆచరించే పనులయందు విజయముపై ఎంత సందేహాస్పదులుగా ఉంటారో భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మనకు తెలియచేస్తున్నది.

రేపు మరియొక శ్లోకంతో మీ ముందుంటాను... సెలవు.

18 Jan 2010

'చమత్'ఖారాలు...

అనగనగా ఒక కవి గారు ... కవి గారు ఒక రోజు ఒకానొక రాజుగారి ఆస్థానానికి వచ్చాడు. రాజుగారిని పొగిడిఅతనినుంచి బహుమానాలు అవీ పట్టుకుపోవాలని ఆశ. కాని రాజుగారిగురించి కవిగారికేమీ తెలియదు. ఐనా సరేనువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని ఏదో ఒకటి పొగిడి పనికానిచ్చేద్దామని అనుకున్నాడు. తీరా రాజాస్థానానికివెళ్ళినతరువాత కాని తెలియలేదు .. రాజుకి కన్ను ఒక్కటేనని ... ఒంటి కన్ను రాజుని ఏమని పొగడాలి ? ముందునుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది అతని స్థితి. అటువంటి పరిస్థితిలో క్రింది పద్యం స్ఫురించింది. చూడండి మరి రాజుని ఎలా పోగిడాడో.

అన్నాతిగూడహరుడవు
అన్నాతిని విడువ అసురగువువుగావే |
అన్నా తిరుమలరాయ !
కన్నొక్కటి కలదుగాని కౌరవపతివే ||

దీని అర్థం ఏంటంటే ...
అన్నా తిరుమల రాయా ! = తిరుమలరాయ రాజా !
( అని, కవి గారు, సభలో కూర్చున్న రాజు గారి భార్యవైపు చూపిస్తూ ఇలా అన్నాడు ... )
అన్నాతిగూడ = + నాతి (స్త్రీ)+ కూడ ( తో కలిసియున్నచో ), హరుడవు ( = శివుడితో సమానం )
---> ఎందుకంటే శివునికి మూడు కళ్ళు ... రాజు తన భార్యతో కలిసివున్న వేళ ఇరువురికి కలిపి మూడు కళ్ళు ... కాబట్టి రాజా నీవు నీ భార్యతో కలిసివున్నప్పుడు పరమశివుడంతటి వాడవు ...

అన్నాతిని = + నాతిని ( స్త్రీ ని ), విడువ = విడచిపెట్టిన యడల , అసురగురువువుకావే = అసుర (రాక్షసుల) + గురువువుకావే ( గురువువే కదా )
---> రాక్షస గురువు శుక్రాచార్యునికి ఒకటే కన్ను. అందువల్ల తన భార్యనుండి విడివడిన యెడల రాజుకి ఒకటేకన్నవడం వలన శుక్రాచార్యునితో సమానం.

కన్నొక్కటి = కన్ను ఒక్కటి, కలదుకాని ( ఉందికాని, లేకపోతే ), కౌరవపతివే = ( కురువంశాధిపతియైన ధృతరాష్ట్రుడివే)
---> కన్ను ఒక్కటి నీకు ఉండిపోయింది కాని రాజా నీకు, అదికూడా లేకుంటే నీవు ధ్రుతరాష్ట్రుడంతటివాడివి సుమా !

విధంగా చమత్కారంతో కవి రాజుని మెప్పించి బహుమతులందుకొన్నాడు.


10 Jan 2010

5 Nice Little Stories ....

1.
Once, all villagers decided to pray for rain, on the day of prayer all the


people gathered but only one boy came with an umbrella...

THAT'S FAITH


2.
When you throw a baby in the air, she laughs because she knows you will


catch her...

THAT'S TRUST


3.
Every night we go to bed, without any assurance of being alive the next

morning but still we set the alarms in our watch to wake up...

THAT'S HOPE

4.
We plan big things for tomorrow in spite of zero knowledge of the future

or having any certainty of uncertainties...

THAT'S CONFIDENCE

5.
We see the world suffering. We know there is every possibility of same or

similar things happening to us. But still we get married??...

THAT'S OVER CONFIDENCE!!

ఇండియా - ది సాఫ్ట్ పవర్

ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ గురించి శశి థరూర్ గారి అద్భుత ప్రసంగం. తప్పకుండా చూడండి.

నా పదం ....

ప్రతి విఫలమొక యత్నం
ప్రతి విజయమొక యజ్ఞం
విఫలమైన ప్రతి యత్నం
విజయానికి సోపానం
ఓటమినే ఎరుగకుంటే
ఏల తెలియు విజయ సౌఖ్యం

-------------------------------------

వాలు జడలతో ఓర చూపుతో
మదిని నువ్వే
కలత రేపావు ....
కలత రేపి
కనుల పడక
ఎక్కడెక్కడ దాగి ఉన్నావు ....

--------------------------------------

చిరుదివ్వెల వెలుగుల్లో
సిరిమువ్వల మధురిమలు...
నీ బంగరు వదనం లో
చిరునవ్వుల గలగలలు ....

----------------------------------------

పరుగెడుతూ పరుగెడుతూ
చీకటిలో అడుగిడుతూ
అమవసనిసి వెన్నెలకై
నలుదిక్కుల కనిపెడుతూ
స్వప్నప్రియ విరహిణి కై
వెతుకుతున్న స్వాప్నికుడా
నులివెచ్చని తొలి తూరుపు
కిరణాలను అనుభవింప
తొందరగా తొందరగా
తొందరగా మేలుకో
మేలుకుని వేచివున్న
విజయాలను చేరుకో

------------------------------------


నిను చూసిన కన్నులకి
మాట రాదు వర్ణింపగా
స్పందించిన హృదయానికి
భాష రాదు రచిఇంపగా
పలుకరాదు అధరాలకు
నిను పొగిడే మాట లేక
కదలరావు నా పదములు
నిను చేరే దారిలేక ...

----------------------------------