2 Feb 2010

నవ్వేజనాః సుఖినోభవంతు .... (1)


ఎవరు గొప్ప ?


అనగనగా...ఒకచోట  ప్రపంచంలో ఎవరు గొప్ప పోలీసులో తెలుసుకొనేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అమెరికా పోలీసులు, రష్యా పోలీసులు, స్కాట్లాండ్ యార్డు పోలీసులు ఇంకా మనవాళ్ళ మధ్యన ఆ పోటీ. ఒక చిరుతపులిని దట్టమైన అడవులలోకి వదిలిపెడతారు. దాన్ని ఎవరైతే తక్కువ టైం లో వెతికి తీసుకువస్తారో వారే విజేతలు. 


మొదటగా అమెరికా పోలీసులు వెళ్ళారు. ఒక గంటలో చిరుతను వెనక్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత రష్యా వాళ్ళు 40 నిమిషాలలోనే ఆ పనిని చేసి అమెరికన్లను చూసి కాలరెగరేసారు. ఆ తర్వాత వెళ్ళిన  స్కాట్లాండ్ యార్డు పోలీసులు అరగంట లోనే చిరుతని వెనక్కి తీసుకొచ్చి రష్యన్ల వేపు పరిహాసంగా చూసారు. 


ఇక తరవాత వంతు మన వాళ్ళది. స్కాట్లాండ్ యార్డు పోలీసుల కంటే తొందరగా మన వాళ్ళు చిరుతని వెతికి తీసుకొస్తారా లేదా అని అందరూ ఉత్కంటతతో ఎదురు చూస్తున్నారు. పదిహేను నిమిషాలు గడిచాయి ..... ఇరవై నిమిషాలు గడిచాయి .... అరగంట కూడా ఐపోయింది .... మనవాళ్ళ జాడ ఎక్కడా లేదు .... గంట గడిచింది ... రెండు గంటలైంది .... ఎక్కడా అలికిడి లేదు ... ఏమైందో చూద్దామని మిగిలిన వాళ్ళందరూ అడవిలోకి వెళ్లి వెతకసాగారు. 


వెతకగా వెతకగా .. మనవాళ్ళు ఒకచోట కనబడ్డారు. అక్కడొక ఎలుగుబంటి చెట్టుకి కట్టేసివుంది. మనవాళ్ళందరూ దాని చుట్టూచేరి కర్రలు పట్టుకుని చితకబాదుతూ ఇలా అరుస్తున్నారు ... "ఒప్పుకో .... నువ్వే చిరుతపులివని ఒప్పుకో .... ఒప్పుకుంటావా లేదా ... " !!??

1 Feb 2010

ప్రతి దినం ... గీతావందనం ... (5)

నేటి శ్లోకం గీత లో  ఐదవది .....

ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్  కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||


ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి నరోత్తములైన మహా యోధులున్నారు.


దుర్యోధనుడు గొప్ప రాజనీతి నిపుణుడని ఇదివరకే చెప్పుకున్నాం. యుద్ధము ఆరంభమయ్యే ముందు తన శత్రుసైన్య బలాబలాలను అంచనా వేస్తూ, గురువు సేనాధిపతియైన ద్రోణునికి హెచ్చరిక చేస్తున్నాడు.

31 Jan 2010

చిన్న కథ ... (1)

[ ఈ కథలు నేను విన్న, చదివిన మనసుకు హత్తుకున్న చిన్ని చిన్ని కథలు. మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ  పొందుపరస్తున్నాను. ఇమేవీ నా సొంతం కాదని మనవి ]

త్యాగం :

ఏమీ ఆశించకుండా ప్రేమించడం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఇది. ఇక చదవండి .....


పదేళ్ళ జాన్ తన చెల్లెలితో ఆడుకుంటూ ఉండగా. ఆ పాప పడిపోయి తలకు పెద్ద గాయం తగిలి చాలా రక్తం పోయింది. జాన్ ది తన చెల్లెలి గ్రూప్ రక్తమే. 

"నువ్వు నీ చెల్లెలికోసం కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు జాన్ ని. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు సరే అన్నాడు. ఆ కుర్రవాడి సంశయాన్ని డాక్టర్ మరోలా అర్థం చేసుకున్నాడు. " పెద్ద నొప్పిగా ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోతుంది "అని చెప్పాడు. 

తన శరీరంలోంచి రక్తం మెల్లమెల్లగా సీసా లోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గరకు  వచ్చి "లే చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు .. " ఇంకా ఎంతసేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్" అని. 

డాక్టర్ విభ్రాంతుడై, " రక్తం ఇస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నావా?" అని అడిగాడు.... దానికా కుర్రవాడు "అవును" అన్నాడు.

డాక్టర్ గొంతు వణికింది.... "అనుకునే ఇచ్చావా?" అన్నాడు కంపిస్తూ. 
అవును అన్నట్లు తలూపాడు జాన్, అమాయకంగా... 

***********************************

ప్రతి దినం ... గీతావందనం ... (4)

నేటి శ్లోకం గీత లో  నాల్గవది .....

అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||

ఈ పాండుపుత్రుల సైన్యమందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహా యోధులు. 

యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుడి గొప్ప శక్తిముందు ధృష్టద్యుమ్నుడు అవరోధము కానప్పటికీ, దుర్యోధనుని భయమునకు కారకులైన వారు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతిఒక్కరు కూడా భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటయే ఆతని భయమునకు కారణము. భీమార్జునుల శక్తి దుర్యోధనునికి తెలిసియుండుట చేతనే ఇతరులను వారిరువురితో పోల్చెను.

30 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (3)

నేటి శ్లోకం గీత లో  మూడవది .....

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యుఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||

ఓ ఆచార్యా ! బుద్ధికుశలుడు, మీ శిష్యుడు ఐన ద్రుపదపుత్రునిచే  వ్యుహముగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనా సమూహమును చూడుము. 

రాజ నీతి నిపుణుడైన దుర్యోధనుడు, బ్రాహ్మణుడు మరియు సైన్యాధిపతియగు ద్రోణాచార్యుని తప్పిదములను ఆధారముగా చేసుకొని రెచ్చగొట్టతలచుకొన్నాడు. అందువలనే ద్రుపదునికి ద్రోణునికి కల రాజకీయ వైరాన్ని గుర్తుచేసే విధంగా ద్రుపద పుత్రుడైన ధృష్టద్యుమ్నుని సైనిక వ్యూహము చే గొప్పగా ఉన్న పాండుపుత్రుల సేనలను చూడమనెను. ద్రోణున్ని గెలిచే పుత్రుడిని ద్రుపదుడు యజ్ఞమాచరించి పొంది, ఆ పుత్రుడిని ద్రోణునివద్దకే యుద్ధవిద్యలను నేర్చుకొనుటకు పంపగా, విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా ద్రోణుడతనికి యుద్ధ సూక్ష్మములను బోధించెను. ఇప్పుడా ధ్రుష్టద్యుమ్నుడే పాండవ పక్షము చేరి సైన్య వ్యూహములు సైతం రచించెను.  కనుక ద్రోణుడు రాజీ లేని ధోరణితో యుద్ధమాచరింపవలెనన్న ఉద్దేశముతో దుర్యోధనుడు ఆ విధముగా ద్రోణుని తప్పిదమును ఎత్తిచూపెను. 

29 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (2)

నేటి శ్లోకం గీత లో రెండవది .....

సంజయ ఉవాచ --
దృష్ట్వాతు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా !
ఆచార్యముప సంగమ్య రాజావచనమబ్రవీత్ ||

ధృతరాష్ట్రుని ప్రశ్న విని సంజయుడు ఈ విధముగా పలికెను : పాండవులచే వ్యుహముగా ఏర్పడిన బలగాలను చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు సమీపించి ఈ విధముగా పలుకుచుండెను.

అంధుడైన ధృతరాష్ట్రునికి బాహ్య దృష్టితో పాటు, ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధార్మిక విషయాలలో తన పుత్రులుకూడా తనతో సమానమైన ఆంధులని అతనికి తెలుసు. కాని కురుక్షేత్ర స్థల ప్రభావమువల్ల పాండవులతో రాజీకి ఏమైనా సిద్ధపడుతున్నారా అన్న సందేహముతో యుద్ధరంగమందు పరిస్థితిని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడని అర్ధంచేసుకున్న సంజయుడు రాజుని ఉత్సాహపరచే ఉద్దేశముతో, అక్కడ రాజీ వంటిది ఏదీ జరగటం లేదని, పాండవ సేనను చూసిన తదుపరి సేనాధిపతియైన గురువు ద్రోణునితో మాట్లాదతలచి దుర్యోధనుడు అతని చెంతకు వెళ్ళాడని ధృతరాష్ట్రునికి తెలియచేసాడు. 
 పాండవసేనలను చూసి పరిస్థితి యొక్క తీవ్రతను అర్ధం చేసుకొన్నవాడై , రాజైనప్పటికినీ దుర్యోధనుడు స్వయముగా సైన్యాధిపతి చెంతకు వెళ్ళవలసి వచ్చెను. ఈ సంఘటన దుర్యోధనుని రాజనీతిజ్ఞతను తెలుపుతూనే పాండవ సేనా వ్యూహము చుసినపిమ్మట అతనికి కలిగిన భయమునుకూడా బహిర్గతపరుచుచున్నది.

పునర్దర్శనం మరలా రేపు... సెలవు ...

28 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (1)

ప్రతి దినం ఒక గీతా శ్లోకం, దాని అర్ధం మరియు సంగ్రహం గా దాని వివరణ చెప్పుకుందాం .... 
నేటి శ్లోకం .... ( గీత లో మొట్ట మొదటి శ్లోకం తో మొదలు పెడుతున్నాము )

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః|
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

[ సంజయుడు వ్యాస మహర్షి శిష్యుడు. వ్యాసుని కరుణతో తానున్న ప్రదేశము నుండియే కురుక్షేత్ర యుద్ధమును చూడగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు సంజయునిని ఈ విధముగా అడుగుచుండెను ]

ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరి సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ?

ధృతరాష్ట్రుడు ఈ విధముగా అడుగుట లో ఒక ప్రాముఖ్యత వుంది. యుద్ధము జరుగు ప్రదేశము దేవతలకు సైతం పూజనీయ స్థానమైన కురుక్షేత్రం. స్వభావరీత్యా ధర్మాత్ములైన పాండవులకు ఆ కురుక్షేత్ర స్థల ప్రభావము అనుకూలముగా ఉంటుందని  అతనికి తెలుసు. అందువలన తన పుత్రులైన కౌరవుల యొక్క విజయావకాశాములపై అతనికి గొప్ప సందేహం ఉంది. అటువంటి సందేహముతోనే ధృతరాష్ట్రుడు సంజయుడిని " వారు ఏమి చేసిరి ?" అని ప్రశ్నిస్తున్నాడు. అధర్మ పరాయణులైన వ్యక్తులకు తాము ఆచరించే పనులయందు విజయముపై ఎంత సందేహాస్పదులుగా ఉంటారో భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మనకు తెలియచేస్తున్నది.

రేపు మరియొక శ్లోకంతో మీ ముందుంటాను... సెలవు.